. రైతుల డబ్బులు కాజేశానని తప్పుడు ప్రచారం చేశారు
. రూ.7కోట్ల బకాయిలు కట్టాలని నోటీసులు అందింది నిజమే
. నాపై ఎలాంటి కేసులు లేవు
. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
బోధన్, బతుకమ్మ: ఆరోగ్య కారణాలతో ఎన్నికల తరువాత తాను దుబాయికి వెళ్తే.. రైతుల డబ్బులు కాజేసి పారిపోయానని తప్పుడు ప్రచారం చేశారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఆదివారం బోధన్ లో సన్నాహక సమావేశం నిర్వహించగా షకీల్ హాజరై ప్రసంగించారు.
తనతోపాటు తన కొడుకుపై అక్రమ కేసులు బనాయిస్తూ తన కుటుంబాన్ని ఆవేదనకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై మండిపడ్డారు. రూ.వేల కోట్లు లూటీ చేశానని, రైతుల డబ్బులు కాజేశానని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్ కు సంబంధించి పెండింగ్ లోన్న బకాయిలు రూ.7కోట్లు కట్టాలని నోటీసులు అందాయని తెలిపారు.
తనపై ఎలాంటి కేసులు లేవని అన్ని కేసుల్లో క్లియరెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసు చేయకుండా చర్యలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్యను షకీల్ కోరారు. ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బోధన్ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.