Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 2:06 pm Posted by : ramakrishna

బీజేపీ తరపున పేదలను గృహ ప్రవేశం చేయిస్తాం

ఇళ్లపై రాజకీయాలు ఆపి వెంటనే పంపిణీ ప్రారంభించాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నగరంలో డబుల్ బెడ్ రూం పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ : బీజేపీ తరపున పేదలను గృహ ప్రవేశం చేయిస్తామని జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్ రూం లను బీజేపీ నాయకుల తో కలసి సందర్శించి మాట్లాడారు. జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలకు అందించకుండా నిలిపివేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు పేదల హక్కు అని, ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రారంభించాలని  డిమాండ్ చేశారు. లేనిచో 2025 ఆగస్టు 15న బీజేపీ ఆధ్వర్యంలో పేదల కోసం తాళాలు పంపిణీ చేసి గృహ ప్రవేశాలు చేయిస్తామని పేర్కొన్నారు.  డబుల్ బెడ్‌రూమ్‌లను ఇస్తామంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మూసివేసిన గోడలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  10 ఏళ్ల కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలా పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లపై రాజకీయాలు ఆపి వెంటనే పంపిణీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజలతో కలిసి బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జగన్ రెడ్డి, శంకర్ రెడ్డి,మాస్టర్ శంకర్, ఆనంద్, నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

We will provide housing to the poor on behalf of the BJP