Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 5:10 pm Posted by : ramakrishna

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్
  • షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేత

 

నిజామాబాద్, బతుకమ్మ : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి 572 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఇంద్రపూర్ లోని నగర యాదవ సంఘంలో 261 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సభ్యులు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ అసంబద్ధ పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. రూ. 7.50 లక్షల కోట్ల అప్పులపై తమ ప్రభుత్వం ప్రతి నెల రూ. 6500 వేల కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోందని

We will continue welfare schemes no matter how many difficulties we face.

ఆవేదన వెలిబుచ్చారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే కృతనిశ్చయంతో మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఇంటి స్థలాలు కలిగిన పేద కుటుంబాల వారు ముందుకు వస్తే, అర్హత కలిగిన వారందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. ఇల్లు మంజూరు కోసం ప్రజలు ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దని, ఎవ్వరికీ నయా పైసా ఇవ్వకూడదని సూచించారు. పార్టీలకు అతీతంగా, పూర్తి పారదర్శకంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ప్రస్తుతం మంజూరీ పత్రాలు అందుకున్న లబ్దిదారులు ప్రభుత్వ తోడ్పాటుతో త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని హితవు పలికారు. కాగా, నగరంలో సొంత స్థలాలు లేని నిరుపేదల కోసం ప్రభుత్వ పరంగా అన్ని వసతులతో కూడిన ఇందిరమ్మ కాలనీలు నిర్మించేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ చైర్మన్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

We will continue welfare schemes no matter how many difficulties we face.