- అక్రమ కేసులెన్ని చేసిన ఎదురుకుంటాం
- న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది
బాల్కొండ, బతుకమ్మ : ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనన్నింటి అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, అక్రమ కేసులు ఎన్ని పెట్టిన ప్రతిపక్ష నేతగా నాపని ప్రశ్నించడమేనని, భయపడేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలే వేల్పూర్ సంఘటనలో అక్రమ కేసులను ఎదుర్కొని బెయిల్ పై వచ్చిన మహేష్, నితీష్,లాల, రహమాన్, గంగాధర్ గౌడ్ లను, వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, మనోధైర్యాన్నిచ్చి, భరోసానిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే వేల్పూర్ సంఘటనలో మా బీయర్ ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టినా హై కోర్టు ఈ కేసులన్నీ అక్రమం అని స్పష్టం చేస్తూ కార్యకర్తలందరికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. నంగి దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు మహబూబ్ నగర్ ప్రాంత వాసి,అక్కడ నుండి వేల్పూర్లో నా ఇంటి లోపలికి వచ్చి దాడికి దిగాడని, దాడి చేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన చిన్న తోపులాటను కేంద్రంగా తీసుకుని రేవంత్ రెడ్డి,పోలీసులు మా కార్యకర్తల మీదే అక్రమంగా హత్యయత్నం కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ఇదేనా ప్రజా పాలన ఇచ్చిటివి, అచ్చేటివి అడిగినోళ్ల పై కేసులు పెట్టడం, భయపెట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి చేస్తున్న కక్షసాధింపు చర్యలని స్పష్టమవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేంత వరకు – ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. మా కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వాటిని మేము న్యాయవ్యవస్థలో ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై మా పూర్తి నమ్మకం,విశ్వాసం ఉందన్నారు. పోలీసులు ఇకనైనా రేవంత్ రెడ్డికి ,కాంగ్రెస్ పార్టీకి చుట్టాల్లగా కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని, లేకుంటే అటువంటి పోలీస్ లు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఘాటుగా హెచ్చరించారు.
