Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:23 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాల నిరోధానికి సమిష్టిగా కృషి చేయాలి

 

. . . అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరుగగా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి,  ఇకపై అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తుండడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు.  నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

We must work together to prevent drug abuse.