- ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాల పరిమితి దాటిన వివిధ శాఖల ఫోరం ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా త్వరగా నిర్వహించుకుని, వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై పోరాడుటకు పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్, పీఆర్సీ అమలు, వివిధ అంశాలపై మాట్లాడారు. పలుమార్లు ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై 63 అంశాలతో కూడినటువంటి ఇతర అంశాలపై వినతి పత్రాలు అందజేశామన్నారు. నేటికీ కొన్ని మాత్రమే అమలుకు నోచుకున్నాయని, మిగతా పెండింగ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు, నిజాంబాద్ జిల్లా పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉద్యోగులందరూ ప్రముఖ పాత్ర వహించి, టిఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన నిర్దేశించిన ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేసేందుకు ఉద్యోగులందరూ సమాయత్తం కావలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చకూరి సతీష్, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.