. . .మీ ఎమ్మెల్యే అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు
. . . వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు లు దెబ్బతిన్నాయి
. . . పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది
. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద కామారెడ్డి జిల్లాలో వచ్చింది . ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పర్యటించారు.

సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్ద్ వంతెన (కేకే వై హైవే) ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బుర్గిద్ద నందు రైతుల పొలాలను పరిశీలించిన, మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మొత్తం పరిస్థితిని సీఎం , మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు . కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు . మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు .కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా అన్నారు.వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు లు దెబ్బతిన్నాయి . పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది .తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చామని శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం అన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం అని తెలిపారు , భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం అన్నారు. రోడ్డు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి . అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది . క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి అని ఆదేశించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేయండి
… ఎమ్మెల్యే మధన మోహన్
ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, వరదల సమయంలో జిల్లా అధికారుల కృషి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు కావలసిన అన్ని వనరులను అందజేశారని తెలిపారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు కూడా కలెక్టర్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది (ప్రత్యేకంగా ఆర్డిఓ, డిఎస్పి), కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బృందం కృషితో కాపాడబడిందని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని సీఎం ను కోరారు.