Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:06 pm Posted by : ramakrishna

మానేరు జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు

 

. . . ఖరీఫ్ సీజన్ వేళ సాగు, తాగునీటి అవసరాలపై పెరుగుతున్న భయం

 

కరీంనగర్, బతుకమ్మ :

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన జలవనరులైన మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి లభ్యత తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అప్పర్ మానేరులో మొత్తం సామర్థ్యం 2 టీఎంసీలు ఉండగా, కేవలం 0.661 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అలాగే మిడ్ మానేరులో 27.5 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.4 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక లోయర్ మానేరులో 24 టీఎంసీలకు గాను కేవలం 6 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు సమాచారం. మానేరు జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గడంతో సాగునీటి అవసరాలు ఎలా తీరుతాయన్న దానిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేసవి ప్రభావంతో నీటి వినియోగం పెరగగా, రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు, రైతులు భావిస్తున్నారు. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయన్న అంచనాలు ఆందోళనకు మరింత కారణమవుతున్నాయి. వర్షాలు ఆలస్యమైతే సాగునీటితో పాటు తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగు కోసం మానేరు జలాశయాలపై ఆధారపడే రైతులు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.