. . . చలివేంద్రం ప్రారంభించిన జిల్లా జడ్జి భారత లక్ష్మీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మానవ నిత్యజీవితంలో నీరుకు ఎనలేని ప్రాముఖ్యత ఉన్నదని, నీటిని పొదుపుగా వాడాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, నిజామాబాద్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆమె సహచర అదనపు జిల్లాజడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు అంగరి చైతన్య, వడ్డి హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు, బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి లతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిరోజు వందలాది మంది కక్షిదారులు కోర్టు కేసుల విచారణకు హాజరు అవుతారని వారి దాహార్తిని తీర్చడంలో చలివేంద్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మానవజీవితంలో నీరు లేకుండా పూట గడవదని, నీటిని పొదుపుగా వాడాలని పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణతోనే జలవనరులను సంరక్షించుకోవచ్చని ఆమె తెలిపారు. వేసవికాలంలో తాగునీరు అందుబాటులో ఉండాలనే సంకల్పబలం న్యాయసేవ సంస్థ, బార్ అసోసియేషన్ తీసుకున్నాయని అన్నారు. చెట్లకు నీరు లేకుంటే వాడిపోయినట్టు మనుషులకు కూడా అంతేనని తాగునీరు అమృతం కంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందనే విషయం గుర్తించి మసలుకోవాలని కోరారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని చెట్లన్ని పచ్చదనంతో కళకళలాడుతున్నాయంటే వాటికి లభిస్తున్న నీరే ప్రధానం అని ఆమె అన్నారు. చెట్లును చూసి మనుషులు నేర్చుకోవలసింది ఏమంటే తాగునీటిని అవసరం మేరకు సేవిస్తూ ఆరోగ్యకరంగా ఉండాలని ఆమె అకాక్షించారు. నగరాలలో, పట్టణాలలో ప్రజా సమూహలు రద్దీగా ఉండే ప్రదేశాలలో స్వచ్చంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి సామాజిక సేవకు అంకితం కావాలని జిల్లాజడ్జి భారత లక్ష్మీ ఆశించారు. ఈ కార్యక్రమంలో బార్ కోశాధికారి మధుసుధన్ గౌడ్, సంయుక్త కార్యదర్శి మానస, లైబ్రరీ కార్యదర్శి పుణ్యరాజ్, క్రీడల కార్యదర్శి బైర గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, న్యాయవాదుల సోసైటీ అధ్యక్షుడు సాయిరెడ్డి, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
