Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 3:12 pm Posted by : ramakrishna

 ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక

 

. . . నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Warning issued that the struggle over public issues will be intensified.
Warning issued that the struggle over public issues will be intensified.