డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్,చా న్స్ ల ర్ జిష్ణు దేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. బుధవారం డిచ్ పల్లి ఏడో బెటాలియన్ లో కమాండెంట్ సత్యనారాయణ, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మొక్కలను నాటారు. అంతకుముందు ఏడో బెటాలియన్ పోలీసులు పోలీసు బ్యాండ్ ద్వారా గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు స్వాగతం పలికారు. తెయూ రెండో స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ కు విద్యార్థుల ద్వారా స్వాగతం లభించింది. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



