- బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే
- బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల తీరు ‘నీకేం కావాలో నాకు చెప్పు, నాకేం కావాలో నీకు చెప్తా’ అన్నట్టు ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒకవైపు ఓట్ల దొంగలు, మరోవైపు దోపిడీ దొంగలు ప్రజలకు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు డీపీఓలతో ఫోన్ ద్వారా సంప్రదించిన అనంతరం, జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని, బీసీ రిజర్వేషన్లు, వరదల నిర్వహణ వంటి కీలక సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించిందని జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలను ఆయన తెలియజేశారు. అదేవిధంగా రేపు మండల కేంద్రాలలో జరిగే సమావేశాలలో మండల అధ్యక్షులు పాల్గొని ఓటరు జాబితాలో ఏమైనా మార్పులు,చేర్పులు (గ్రామం, పోలింగ్ బూత్, లేదా వార్డు మార్పు వంటివి) చేయాలనుకుంటే, అవసరమైన ఆధారాలతో వెంటనే గ్రామ, మండల, పట్టణ శాఖ అధ్యక్షులను సంప్రదించాలని పేర్కొన్నారు.