- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బతుకమ్మ, బాన్సువాడ : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు.బాన్సువాడలో పీస్ కమిటీ సమావేశానికి సోమవారం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఊరూరా, కాలనీ వారీగా ఏర్పాటయ్యే మండపాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, పోలీసులు సూచించే మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు. పండుగలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటు, మైక్ల వినియోగం, నిమజ్జన కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. శబ్ధకాలుష్యం, పర్యావరణ కాలుష్యం లేకుండా ఉత్సవాలను జరుపుకోవాలని, నిమజ్జన సమయంలో ట్రాఫిక్ అంతరాయాలు రాకుండా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో అనవసరంగా మైక్ల వాడకాన్ని నివారించాలని సూచించారు. అన్ని మతాల వారందరూ సహకారం అందిస్తే పండుగలు విజయవంతంగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి,పట్టణ సీఐ అశోక్,రూరల్ సీఐ తిరుపతయ్య,మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, విద్యుత్ శాఖ అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.