- మార్కెట్ ఫీజు కు అదనంగా కమీషన్ వసూల్
- నలుగురు ఖరీదుదారులు చెప్పిందే ధర
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సూత్రదారి
- నోరు మెదపని పాలకవర్గం, అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్ చూర్ రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కుడా ఆమ్ చూర్ రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఆమ్ చూర్ అమ్ముదామని తెచ్చి నిలువున మొసపోతున్నారు. తెలంగాణ లో మలక్ పేట్ వ్యవసాయ మార్కెట్ లో, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఆమ్ చూర్ ను వ్యాపారులు (ఖరీదుదారులు ) కొనుగోలు చేస్తున్నారు. కాని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పెద్ద ఎత్తున రైతు ప్రతి ఏడాది ఆమ్ చూర్ తీసుకువచ్చి అమ్మకాలు చేస్తుంటారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడి పంట ఆధారంగా క్రయ విక్రయాలు నిజామాబాద్ లోనే ఎక్కువ. ఎండకాలంలో జరిగే క్రయ విక్రయాల కోసం ప్రతి ఏటా రైతులు వ్యయప్రయాసాలకు ఓర్చి తమ ఆమ్ చూర్ ను తెచ్చి అమ్ముకుందామంటే మార్కెట్ ఫీజును పెంచి వసూలు చేస్తున్నారు. ఖరీదుదారులు కుమ్మక్కై ధరలను సిండికేట్ గా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఏకంగా సంచుల తూకంలోను మోసం చేస్తున్నారు వ్యాపారులు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి వేసవిలో ఆమ్ చూర్ క్రయ విక్రయాలు జరుగుతాయి. ఉత్తర భారతంలోని ప్రజలు ఆమ్ చూర్ (వంటలలో పులుపుగా) వాడేందుకు వినియోగిస్తారు. ఉత్తర భారతంకు ఎగుమతి చేసేందుకు ఇక్కడ అనువుగా రవాణా వ్యవస్థ ఉండటంతో క్వింటాళ్ల కొద్దీ ఆమ్ చూర్ ను నిజామాబాద్ లో అమ్ముతుంటారు మామిడి రైతులు, కౌలు దారులు. సాధారణంగా మార్కెట్ కమిటీకి కొనుగోళ్లపై రైతు నుంచి 2 శాతం కమీషన్ వసూలు చేస్తారు. కాని ఎనిమది శాతం కమీషన్ ఇస్తేనే మార్కేట్ లో కాంటా(తూకం) వేస్తున్నారు వ్యాపారులు. రెండు శాతం మార్కెట్ కు వెలుతుండగా ఆరు శాతం అధికారులు, పాలకవర్గం, వ్యాపారులు పంచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మార్కెట్ లో ఆమ్ చూర్ ను తెచ్చిన సంచుల తూకంలోను మోసం చేస్తున్నారు ఖరీదు దారులు. చక్కెర బస్తా( గోనే సంచి) 700 గ్రాములకు గాను 1000 గ్రాములుగాను, ప్లాస్టిక్ సంచి 300 గ్రాముల బరువుతూగుతుంటే దానిని కుడా 1000 గ్రాములుగా లెక్కలు రాస్తున్నారు. మార్కెట్ లో ఆమ్ చూర్ కు మాడల్ ధరను మార్కెట్ కమిటీ నిర్ణయిస్తుండగా మాయిశ్చరైజర్ పేరిట ఖరీదుదారులు పెట్టి రైతులను నిలువున ముంచేస్తున్నారు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులు ( ఖరీదుదారులు) సిండికేట్ అయ్యారు. నలుగురు వ్యాపారులు మాత్రమే దందాకు అనుకూలమని చెబుతున్నారు కాని ఇద్దరు మాత్రమే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఆ నలుగురుని కాదని ఇతర వ్యాపారుల వద్దకు సరుకులు వెళితే అధికారులు, వ్యాపారులు కొర్రీలు పెట్టి వేదిస్తున్నారు. కనీసం వ్యాపారులను కుడా వదలడం లేదు వారిని కుడా బెదిరించే పరిస్థితి నెలకొంది. మార్కెట్ కమిటీ ఫీజు 2 శాతం కాగా మిగిలిన ఆరు శాతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి వెలుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పేరుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఐనా షాడో కార్యధర్శిగా వ్యవహిరస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. రైతులకు మేలు చేయాల్సిన పాలకవర్గం, మర్చంట్ అసోసియేషన్ వ్యాపారులు, అధికారులు మామిడి రైతులను నిలువునా ముంచుతున్న అడిగే నాథుడే లేడనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్ లో జరుగుతున్న నిలువు దోపిడీపై పాలకవర్గం కాని, అధికారులు కాని నోరు మెదపడం లేదు. రైతులు గగ్గోలు పెడితే వారి వద్ద వసూలు చేసే కమీషన్ లో తగ్గిస్తున్నారు కాని వసూళ్లు మాత్రం ఆగడం లేదు. మరో వారంలో వానలు కురిస్తే సీజన్ అయిపోతుందని అంటూనే గత నెల నుంచి రైతులను దోచే ప్రక్రియ మాత్రం ఆగడం లేదు.
