మాక్లూర్, బతుకమ్మ :
మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ కమిటీ వ్యవస్థాపకురాలు అమృత లత రెడ్డి అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారికి నియమ నిష్టలతో మేల తాళాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లత రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం స్వామివారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసి వెంకటేశ్వర స్వామి వారికి నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలను నిర్వహించామని వారన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం స్వామివారికి నిత్య హోమము, బలిహాము, శ్రీవారి కల్యాణోత్సవం, శ్రీవారికి గరుడసేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అపురూప వెంకటేశ్వర ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభన సంతరించుకుందని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో జిల్లాలో నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృత లత, ప్రభాదేవి, సుజాత, వసంత, విజయ, సునీత, సురేందర్ రెడ్డి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
