నిజామాబాద్ సిటీ బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి.ఆర్. శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి జయంతి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దళిత సమాజానికి చెందిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం గొప్ప కార్యమని, సామాజిక సమరసత్వం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచీ ఉందని తెలిపారు. మధ్యలో కొంతమంది స్వార్థపరులు వారి ప్రయోజనాల కోసం హిందూ సమాజంలో అంటరానితనాన్ని తీసుకువచ్చి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, ఆ దిశగా నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేయడానికి కంకణం కట్టుకున్నారని, మనమంతా ఒకటేననే భావంతో ఉండాల్సిన అవసరం ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఉందన్నారు. కార్యక్రమంలో కుమార్, బాలకృష్ణ, సంజీవ్, ముత్యం, దీపక్, కెప్టెన్ రాజు, ముక్తార్ సింగ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.