బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వెంకటేశ్వర స్టీల్ షాప్ వద్ద లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారయ్యే విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయని, జలవనరులు నాశనమవుతాయని, అలాగే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. అయితే మట్టి గణపతులను ఉపయోగించడం వలన ప్రకృతికి ఎటువంటి హాని జరగదని, వాటిని నీటిలో విసర్జించినా సులభంగా కరిగిపోతాయని వివరించారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, మట్టి గణపతులనే ఇంటికి తీసుకెళ్లి వినాయకుని పూజించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాపారావు, నరసయ్య నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకటేశం పాల్గొని మట్టి గణపతులను ప్రజలకు అందజేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి గణపతులను స్వీకరించారు.
