Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:03 pm Posted by : ramakrishna

విద్యా వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టెందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

 

. . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ లీకేజీ పై తగిన చర్యలు చేపట్టాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అన్నారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజీలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఎన్ ఆర్ భవన్ కోటగల్లి ఆఫీసులో మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్క గణేష్, పి.వై.ఎల్.యువజన సంఘం అధ్యక్షులు డి.నవీన్ కుమార్ లు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీల ఆరోపణలు వెలుగులోకి రావడం అత్యంత ఆందోళనకర విషయమన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, భవిష్యత్తుపై ఆశలతో ఈ పరీక్ష రాస్తుండగా, కొందరి అక్రమ చర్యల వలన వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిందనే వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగించాయన్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష పారదర్శకత పూర్తిగా దెబ్బతిందన్నారు. అందువల్ల విద్యార్థుల న్యాయం కోసం నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేసి, పూర్తి భద్రతా చర్యలతో మళ్లీ నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సంబంధిత దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరపాలనీ, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు జి.నితిన్, జిల్లా యువజన సంఘం కార్యదర్శి సాయిబాబా, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.