నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నియోజకవర్గంలోని అవసరమైన వారికి నిమ్స్ లో చికిత్స పొందేందుకు ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని కార్యాలయంలో శనివారం ఎల్వోసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. నగరంలోని గాజుల పేటకు చెందిన తోక శ్రావణ్ కుమార్ గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్ లో చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు. అలాగే హైదరాబాదులోని బీబీనగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అత్యవసర శస్త్రసికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్ కి వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేయి కోట్లతో నిర్మించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. కావున నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.