నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో చేపట్టనున్న జన జాగరణ యాత్రకు సంబంధించిన గోడపత్రికను మంగళవారం టీఎన్జీఓ భవన్లో ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు విక్రమ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జన జాగరణ యాత్రలో భాగంగా జూలై 22, 23 తేదీల్లో బోధన్, నిజామాబాద్ పట్టణాల్లో నిర్వహించనున్న సీపీఎస్ వ్యతిరేక ర్యాలీల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణపై ఉద్యోగుల ఆకాంక్షను ప్రభుత్వానికి బలంగా వినిపించే లక్ష్యంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసీరామ్, ప్రసాద్, బీరేందర్ సింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.