Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:21 pm Posted by : ramakrishna

అంటరానితనం అమానుషం

 

. . . ఇందల్వాయి ఎస్సై సుమలత

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

అంటరానితనం అమానుషమని, దానిని పాటించడం చట్టరీత్యా నేరమని ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపారు. మండలంలోని గన్నారం గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల పరిరక్షణ చట్టం, అంటరానితనం నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ సుమలత, తహసీల్దార్ బాలయ్య, ఎంపీడీవో అనంతరావు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షకు సమాజంలో ఎలాంటి స్థానం లేదని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ సుమలత మాట్లాడుతూ సమానత్వం, సామరస్యం, సామాజిక న్యాయం విలువలను కాపాడుతూ సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కుల వివక్షకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ బాలయ్య మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై వివక్ష చూపడం చట్టవిరుద్ధమని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యతతో కలిసి మెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వివక్షకు పాల్పడినట్లు రుజువైతే నిబంధనల ప్రకారం శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలంతా పరస్పర గౌరవంతో జీవిస్తూ సమాన హక్కులతో కూడిన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి శంకర్, ఆనంద్ స్వామి, సర్పంచ్ సుజాత శ్రీనివాస్, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

 

Untouchability is inhumane.