. . . కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నేలరాలిన వరి ధాన్యం
. . . ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు
రుద్రూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో, చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైంది. రుద్రూర్ మండల కేంద్రంలోని లింగంపల్లి, చిక్కడపల్లి, అక్బర్ నగర్, అంబం(ఆర్), ఠాణంపల్లి క్యాంపు తదితర గ్రామాలల్లో తీవ్రంగా ఉంది. మరో పది రోజుల్లో కోతకు వస్తుందనుకున్న వరి పంట, వడగండ్ల వర్షానికి గింజలన్నీ రాలిపోయాయి. అంబం(ఆర్) గ్రామంలో సుమారు 200 ఎకరాలు పంట నష్టం వాటిల్లడంతో ఏవో సాయి కృష్ణ పంటలను పరిశీలించారు.

ఠాణంపల్లి క్యాంపులో సుమారు 300 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
