Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 4:12 pm Posted by : ramakrishna

ఆగనంటున్న వరద…?

కోర్టు తీర్పు ప్రకారం గేట్లు మూసిన తెరువవలసినదే…?
బతుకమ్మ, మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయినటు వంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29 మంగళవారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేస్తారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వచ్చే వరదలకు బ్రేకు పడబోతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జులై 1న బాబ్లీ గేట్లు ఎత్తి అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి ఒకటవ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్సారెస్పీకి 0.6 టిఎంసిల నీటిని వదులుతారు. కోర్టు తీర్పులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసి వేయడం జరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 2.5 టిఎంసి కావడంతో ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండి జలకలను సంతరించుకుంది. కావున బాబ్లీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మిగులు జలాలను దిగువకు వదలడానికి మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 14,454 వచ్చి చేరుతోంది.