వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్తో పాటు సోషల్ మీడియా ఇన్ చార్జిలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్పై కేసులు నమోదు చేశారు. నకిరేకల్ పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం లేకున్నా సోషల్మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్ వేర్వేరుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పేపర్ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందని వచ్చిన కథనాన్ని కేటీఆర్ ’ఎక్స్‘ వేదికగా షేర్ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.