. . . జాతీయ రహదారి 44 పై ప్రమాదం
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పై గురువారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ విషయాన్ని టోల్ ప్లాజా హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇందల్వాయి పోలీసులకు సమాచారం అందించగా తక్షణమే స్పందించిన ఇందల్వాయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గేదెల మృతిపై సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకుంటామని ఇందల్వా ఎస్సై సుమలత తెలిపారు. రాత్రి వేళల్లో పాడి రైతులు తమ పశువులను రోడ్లపైకి వదిలేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోందని పెట్రోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. హైవేలపై పశువులను వదిలిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొందరు రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాడి రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సాయంత్రం వేళల్లో తమ పశువులు ఇంటికి చేరుకోకపోతే వాటిని వెతికి సురక్షితంగా ఇంటికి తెచ్చుకోవాలని కోరారు. పశువులను రోడ్లపైకి రాకుండా చూసుకోవడం ద్వారా అటు పశువుల ప్రాణాలను, ఇటు వాహనదారుల ప్రాణాలను కాపాడవచ్చని టోల్ ప్లాజా సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
