Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 8:44 pm Posted by : ramakrishna

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్  చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. నగరంలోని ఖోజా కాలనీలోని ఇస్లంపురకు చెందిన అతర్ బైగ్, షేక్ అజ్మద్ పాత నేరస్తులు. వీరు మందు, సిగరేట్, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిసై జల్సాలకు అలవాటు పడ్డారు. దీంతో నగరంలో ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి, కొట్టి డబ్బులు లాక్కునేవారు. ఇదే క్రమంలో గతనెల 31న ఎరుకల  వాడలోని ఒక ఇంటిలోకి వెళ్లి బీరువా పగుల గొట్టి బంగారు ఆభరణాలు, రూ.1500, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించారు. దొంగిలించిన సొత్తును గంజ్ మార్కెట్ ప్రాంతంలో అమ్మేందుకు ప్రయత్నించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకుని విచారించగా వారి వద్ద నుంచి బంగారు ముక్కు పుడక, ఉంగరం, వెండి కడియాలు, ఒత్తులు, మొబైల్ ఫోన్, రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగతనం కేసును చేదించిన సీఐ రఘుపతి, ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుళ్లు గంగారాం, ప్రభురాజ్ లను ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.