నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి బైక్ లను చోరీలు చేసి అమ్ముకుని తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు ఘరానా బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఐదవ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సహబ్ పహడ్ ప్రాంతంలో మంగళవారం వాహనాల తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా పట్టుకోవడంతో ఘరానా బైక్ దొంగల గుట్టు రట్టైనట్టు ఏసీపీ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రహ్మత్ పురకు చెందిన సయ్యద్ యూనుస్ అనే వ్యాపారి తన బైక్ చోరీ గురించి ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిజామాబాదు డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నార్త్ రూరల్ సిఐ బి.శ్రీనివాస్, ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ సిబ్బంది ఆధ్వర్యం లో ఒక టీమ్, నిజామాబాద్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్ సిబ్బంది ఆధ్వర్యంలో మరొక టీమ్ ఏర్పడి ఇట్టి కేసుల చేధన కోసం నిజామాబాద్ నగరం లోని వర్ని చౌరస్తా దగ్గర సిసి టివి పుటేజీలను ముజాహిద్ నగర్ వద్ద సిసి టివి విజువల్స్ ఇతర ఆధారాల ద్వారా నిజామాబాద్ లో ని వివిధ పిఎస్ ల పరిధులలో బైక్ ల దొంగతనంలలో నిందితులు గురించి ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం బాబాన్ సహబ్ పహాడ్ దగ్గర పెట్రోల్లింగ్ నిర్వహిస్తుండగా బోదన్ పట్టణంలో అనిస్ నగర్ కు చెందిన షేక్ ఇలియాస్, షేక్ సమీర్ లు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అట్టి నిందితులని అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన బైక్ దొంగతనాలు ఒప్పుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్ పరారీలో ఉన్నారు. ఇద్దరి నుంచి 10 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర తో పాటు నిజామాబాద్ జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. పరారీలో ఉన్న రియాజ్ ను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
