నిజామాబాద్, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో నాయకులు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మనదేశంలో కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందన్నారు. 8 గంటల పని విధానం రద్దుచేసి, 12 గంటల పని విధానం తీసుకొచ్చే కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లోనే, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. యూనివర్సిటీ, కేజీబీవీ, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి తదితర రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కార్మికులను చైతన్య పరచడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 5న జానకంపేట్ లోని ఎస్.కె కన్వెన్షన్ హాల్ లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి.మల్లేష్, కోశాధికారి పి.సాయరెడ్డి నాయకులు కే.గంగాధర్, కే.గణేష్, ఎం.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.