👉 చెరువులో దూకి ఎస్సై ఆత్మహత్య
👉 మహిళా కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా
👉కామారెడ్డి జిల్లాలో సంచలనం
నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన ట్రయాంగిల్ ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఆత్మహత్యకు పాల్పడిన వారు పోలీస్ శాఖకు చెందిన ముగ్గురు కావడం రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఈనెల మొదటి వారంలో వాజేడు ఎస్సై తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే కామారెడ్డి జిల్లాలో మరొక యువ ఎస్సై చెరువులో దూకి తన ప్రాణాలను తీసుకున్నాడు. అతనితోపాటు అతని పోలీస్ స్టేషన్లో పనిచేసే రైటర్ కూడా ,ఎస్సై పనిచేస్తున్న సర్కిల్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్ కూడా చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి పట్టణ శివారులోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురి ఆత్మహత్యలు కలకలం రేపాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని గాలించగా ఎస్సైతోపాటు స్టేషన్ రైటర్, మహిళా కానిస్టేబుల్ సంబంధించిన సెల్ ఫోన్ ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని డెడ్ బాడీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ రాత్రి పెద్ద చెరువు వద్దకు చేరుకొని రెస్క్యూటింతో డెడ్ బాడీల గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ట్రయాంగిల్ ఆత్మహత్య లకు గల కారణాలు తెలియలేదు. డెడ్ బాడీ లు దొరికితే గాని కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ కామారెడ్డి జిల్లా సరిహద్దు పోలీస్స్టేషన్లో ఎస్హెచ్ఓ గా పని చేస్తున్నారు. అతని పోలీస్ స్టేషన్లో పనిచేసే రైటర్, ఎస్ హెచ్ ఓ పరిధిలోని సర్కిల్లో మహిళ కానిస్టేబుల్ కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది అంత చిక్కడం లేదు.