Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:06 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో ఎస్సైల బదిలీలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మాచారెడ్డి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ను భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. భిక్కనూరు ఎస్సైగా పనిచేస్తున్న ఆంజనేయులును రాజాంపేట స్టేషన్‌కు పంపించారు. రాజాంపేటలో విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌కు కేటాయించారు. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్‌ను మాచారెడ్డికి బదిలీ చేయగా, బాన్సువాడ టౌన్ ఎస్సై నవీన్ చంద్రను బీబీపేటకు బదిలీ చేశారు. ఈ బదిలీలతో పలు మండలాల్లో కొత్త ఎస్సైలు బాధ్యతలు చేపట్టనున్నారు. తమ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.