హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎనిమిది మంది సీఐలను బదిలీ చేశారు. ఇందులో ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. మల్టీ జోన్–1 పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలను జూన్ 23న ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మందికి స్థానచలనం కల్పించారు. వెయింటింగ్లో ఉన్న సీఐ నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్లో విధులు నిర్వహిస్తున్న కన్నం కుమారస్వామిని మధిరకు, కామారెడ్డి సీఎస్బీలో పనిచేస్తున్న తిరుపయ్యను బాన్సువాడ రూరల్కు పంపించారు. వెయిటింగ్లో ఉన్న ఆర్ బన్సీలాల్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ సర్కిల్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తుపల్లి సీఐగా పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, మధిర సీఐ దొంగరి మధు, బాన్సువాడ సీఐ తోకల రాజేష్ను హైదరాబాద్లోని మల్టీజోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.