నిర్మల్, బతుకమ్మ :
నిర్మల్ జిల్లా బాసర పొరుగు గ్రామమైన గోదావరి నది తీరంలో గల యంచ గ్రామంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. “రెండో పండరీపురం”గా పేరొందిన యంచలో వేకువజామున విఠల – రుక్మిణులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉపవాస దీక్షలతో భక్తులు ఉదయమే బారులు తీరారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి కలశం, భజనలతో దిండి శోభాయాత్ర సాగింది. మహిళలు, భజన బృందాలు పాల్గొన్నారు. మధ్యాహ్నం మహా హారతి తర్వాత తెలుగు, మరాఠీ భజనలతో ప్రాంతమంతా హరినామంతో మారుమోగింది. నిజామాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు శోభాయాత్రలో పాల్గొన్నారు. గ్రామస్తుడు పుట్టి పండరి భక్తులకు అరటిపళ్లు పంపిణీ చేశారు.
