. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 13న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నగరంలో మొత్తం 15 ఎగ్జామినేషన్ సెంటర్ లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్ష జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పరీక్షా కేంద్రము పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (పాత సెక్షన్ 144 సి.ఆర్.పి.సి) అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. అలాగే మే 13న పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్ నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని సీపీ అన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ సీపీ విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు.