. . . అనుమానాస్పద లావాదేవీలపై గట్టి నిఘా
. . . జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రచార ఖర్చులపై పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు కిషన్ పమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏఈఓల బృందాలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏం.సి.సి., ఎం.సి.ఎం.సి. నోడల్ అధికారులు, ఏఈఓలు తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వ్యయ నియంత్రణలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు (AEO)లు కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చులు ప్రతి అభ్యర్థి ఖాతాలో ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా డబ్బు, మద్యం, విలువైన వస్తువులు తదితరాలను అక్రమంగా పంపిణీ చేయకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. అనుమానాస్పద లావాదేవీలు, బల్క్గా సరఫరా అవుతున్న వస్తువులు, నగదు కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఆయా బృందాలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికల ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఏ చిన్న ఉల్లంఘనకైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా అధికారులు సమిష్టిగా పని చేసినప్పుడే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఫర్ ఎక్స్ పెండిచర్ ఆనంద్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.