- చికిత్స పొందుతు భర్త మృతి
- భార్య, తనయుడి పరిస్థితి విషమం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో పురుగులు మందు తాగి అత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ముగ్గురిలో ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న విషయం వెలుగు చూసింది. రెండవ టౌన్ ఎస్హెచ్ ఒ సయ్యద్ ముజాహీద్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… శివాజీ నగర్ కు చెందిన దాసరి కిషన్ (60), దాసరి నాగమణిలు భార్యాభర్తలు. వారికి దాసరి వంశీ (30 ) అనే కుమారుడు ఉన్నాడు. దాసరి కిషన్ స్థానికంగా ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ ను నిర్వహిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాసరి వంశీ ఎలాంటి పని చేయయకుండా, మద్యానికి బానిసయ్యాడు. దానితో అతనికి వివాహం చేసుకోవాడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడంతో తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈవిషయంలో భార్య, భర్త, కొడుకులు గొడవ పడ్డారు. అప్పుడు వంశీ ఆవేశంలో ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగాడు. అతన్ని చూసిన భార్యాభర్తలు కిషన్, నాగమణిలు కూడా పురుగుల మందుతాగారు. వారిని స్థానికులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కిషన్ చికిత్స పొందుతు మరణించాడు. వంశీ, నాగమణిల పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు దాసరి కిషన్ సోదరుడు దాసరి బాల క్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- జిల్లాలో వరుస ఆత్మహత్య ఘటనలు..
నిజామాబాద్ జిల్లాలో వరుసగా కుటుంబ సభ్యుల ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. 2022 జనవరి 8న నిజామాబాద్ నగరానికి చెందిన పప్పుల ప్రసాద్ అనే వ్యక్తి ప్రైవేట్ పైనాన్సియర్ (వడ్డి వ్యాపారీ) వేదింపులు భరించలేక తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పురుగుల మందు తాగి ముగ్గురు, ఒక్కరు క్రిష్ణనది లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2024 అక్టోబర్ 5 న ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేష్ అతని భార్య హేమలత, కుమారుడు హరీష్ లు కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హరీష్ పబ్జీ గేమ్ ఆడి 30 లక్షల అప్పులు చేయడంతో వాటిని తీర్చే దారిలేక ముగ్గురు ఉరివేసుకుని బలవన్మరణంకు పాల్పడ్డారు. 2024 నవంబర్ 7న నిజామాబాద్ పట్టణంలోని రోటరి నగర్ కు చెందిన ఉప్పలంచి వేణు తన కుతురు పూర్ణిమ, భార్యతో కలిసి బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో భార్య అనురాధను స్థానికులు కాపాడగా తండ్రీ కూతురు నీట మునిగి చనిపోయారు. ముగ్గురి ఆత్మహత్యకు వడ్డీవ్యాపారుల వేదింపులే కారణం అని విచారణలో తేలింది.