నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సంక్షేమ బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు విద్యార్థినీలు వెళ్లిపోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. ఉదయం హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి స్థానిక రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం బహిర్గతమైంది. స్థానిక హాస్టల్ లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో 10వతరగతి చదువుతున్న విద్యార్థిని (15), ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు (14) గురువారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం ప్రేయర్ (ప్రార్థన) సమయంలో గుర్తించిన అధికారులు ముందుగా బాలికల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తరువాత అధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- హాస్టల్ వార్డెన్ ఎక్కడ.. వాచ్ మెన్ లేరా..?
ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కౌమారదశ విద్యార్ధినీలు హాస్టల్ నుంచి వెళ్లిపోతుంటే అక్కడ వార్డెన్ పర్యవేక్షణ ఎమిటని చర్చ జరుగుతుంది. అసలు అక్కడ పనిచేస్తున్న వాచ్ మెన్ ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వార్డెన్ తన ఇంటిలో జరుగనున్న వివాహ వేడుకలకు సెలవు పెట్టకుండా స్థానికంగానే రాకపోకలు చేస్తున్నట్లు తెలిసింది. మూడు రోజులలో విందు ఏర్పాట్ల కోసం గురువారం ఉదయం కూడా హస్టల్ లో కూరగాయలు ఇచ్చి వెళ్లిన వార్డెన్ కు ముగ్గురు విద్యార్ధినీలు కనిపించకుండా పోయిన విషయం తెలియకపోవడం గమనార్హం. మహిళ వాచ్ మెన్ ఉండగా అధికారులు ఎవ్వరు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రార్థన సమయం 7 గంటల వరకు విద్యార్థినీల అద్రుశ్యం వ్యవహారం వెలుగు చూడకపోవడంపై వెల్పేర్ అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. జిల్లా కేంద్రంలోనే అధికారుల పర్యవేక్షణ లేకుంటే మారుమూల ప్రాంతాల హాస్టల్ ల పరిస్థితి ఏమిటనే వాదనలు ఉన్నాయి.
- మూడు టీంల చేత గాలింపు చర్యలు..
నిజామాబాద్ నగరంలో ముగ్గురు విద్యార్థినీలు కనిపించకుండా పోయిన వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును చేదించడానికి మూడు టీంలను ఏర్పాటు చేసినట్లు నగర సిఐ శ్రీనివాస రాజు తెలిపారు. ఇప్పటికే సాంకేతిక కారణలతో ముగ్గురు విద్యార్థినీలను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఉదయం స్థానికంగా సీసీ టీవ పుటేజీలను పరిశీలించారు.
