నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరానికి చెందిన వృద్ధుడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని అతడి వద్ద ఉన్న నగదును దోచిన ముగ్గురిని 24 గంటలలో అరెస్టు చేసినట్లు మూడవ టౌన్ ఎస్ఐ తెలిపారు. నగరంలోని హమల్వాడికి చెందిన మాలోత్ సర్ధార్ (60) అను వృద్ధుడు కామారెడ్డి వెళ్లడానికి కంటేశ్వర్ లో గల తేనె సాయిబాబా మందిరం ముందు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. సర్ధార్ ని బలవంతంగా ఎక్కించుకొని అతని వద్ద నుండి 5500 నగదు ,ఒక మొబైల్ ఫోన్ ని లాక్కొని సర్దార్ ని కంటేశ్వర్ లో దింపేసి ముగ్గురు వ్యక్తులు ఆటో లోనే పారిపోయారు. మాలోత్ సర్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 3న అట్టి ముగ్గురు వ్యక్తులని గురు బాబాది రోడ్లో పట్టుకొని వారి పేర్లు విచారించగా వారి పేర్లు సయ్యద్ బషీర్, అబ్దుల్ ఖాదర్, షేక్ అలీమ్ లు గా చెప్పారు. బషీర్ అను వ్యక్తి మహ రాష్ర్టలోని నాందేడ్ కు చెందిన వ్యక్తి ఈ నెల 2న నిజామాబాద్ కి వచ్చి తన మిత్రులైన షేక్ అలీమ్ , ఖాదర్ ని కలిసారు. షేక్ ఖాదర్ యొక్క ఆటోలో తిరుగుతూ ముసలి వాళ్లు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి బంగారం లేదా డబ్బులు గుంజుకోవాలని పథకం వేశారు. వారు ముందుగా వేసుకున్న ప్రకారమే మాలోత్ సర్దార్ అనే వృద్ధుడు వద్ద నుండి రూ.5500 నగదు ,సెల్ ఫోన్ లాక్కున్నారు. నేరం ఒప్పుకున్నందున వారి వద్ద నుండి రూ2500, నేరానికి ఉపయోగించిన ఆటో ని స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.