- ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
నిజామాబాద్, బతుకమ్మ : పట్టభద్రులంటే అర్ధం తెలియని వాళ్లు కూడా పోటీలో నిలుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్,బోధన్ లో పర్యటించారు.బోధన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ వ్యాపారాలను విస్తరించడానికి నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి లు రాజకీయాలకు వస్తున్నారని అన్నారు., ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంపాదించుకోవడానికే వచ్చాడాని,ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను విస్తరించుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. విద్యావంతులు తన వైపే ఉన్నారని వారి శ్రేయస్సు కోసం పాటుపడతానని అన్నారు. గత ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను వంచన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తరువాత 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మభ్యపెట్టి 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, విద్యా విభాగంలో ఎంతో అనుభవం కలిగి ఉన్న తనతో డిబెట్ పెడితే ఎవరికి ఎలాంటి అవగాహన ఉందో ప్రజలకే అర్థం అవుతుందన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన పట్టభధ్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యా సంస్థల వ్యాపారులు,కాంగ్రెస్,బిజెపికి చెందిన అభ్యర్థులు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాలకు రాలేదని ఆరోపించారు. విద్యారంగంపై కనీస అవగాహన లేని వారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని, అదేవిధంగా పెట్టుబడిదారులకు సామాన్యునికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో తనకు గ్రాడ్యుయేట్లు బ్రహ్మరథం పడుతున్నారని ఎక్కడికి వెళ్లినా, తనను ఆత్మీయంగా స్వాగతిస్తూ మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు. ప్రతి పట్టభద్రుడు ఈ విషయమై చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, వెంకటేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
