. . . అసలు ఇది పర్మిట్ రూమా?.. లేక దాబానా
. . . బార్లకు మించి వైన్స్ పక్కన పర్మిట్ రూమ్ ఏర్పాటు
. . . ఎక్సైజ్శాఖ సహకారంతో నిబంధనలు ఉల్లంఘన
. . . మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా అధికారుల ఉదాసీనత
రుద్రూర్ బతుకమ్మ :
మద్యం దుకాణాల వద్ద పర్మిట్ గదులను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకు మద్యం తాగాలంటే బార్లకు వెళ్లేవారు. ఆ తరువాత మద్యం దుకాణాల వద్ద పర్మిట్ గదుల ఏర్పాటుకు అనుమతించారు. అది కూడా వైన్స్ యజమానులు అడిగి, కొంత డబ్బు చెల్లిస్తే.. చిన్నపాటి పర్మిట్ గది (నిబంధనల ప్రకారం 10/10 అడుగులు) ఏర్పాటుకు ఓకే చెప్పేవారు. పర్మిట్ గదులంటే కూర్చోవడానికి సీటింగ్ ఉండకూడదు. టేబుల్ ఉంటే నిలబడి తాగి వెళ్ళిపోవాలి. కానీ రుద్రూర్ మండల కేంద్రంలోని టెన్ టు టెన్ లిక్కర్ వైన్స్ వెనుకాల ఉన్న పర్మిట్ రూమ్ అందుకు విరుద్ధంగా ఉందనే చెప్పవచ్చు. అసలు ఇది పర్మిట్ రూమా?.. లేక దాబానా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్ లో నిలబడి త్రాగాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కూర్చోవడానికి ఏకంగా రాయితో బల్లలు ఏర్పాటు చేసి పర్మిట్ రూంలో యదేచ్చగా కొనసాగిస్తున్నారు.
. . . బార్ లను మించిపోతున్న పర్మిట్ రూమ్
పర్మిట్ గదులు నిబంధనలకు విరుద్ధంగా బార్లను మించిపోతున్నాయి. ఈ విషయం ఎక్సైజ్శాఖకు తెలిసినా టార్గెట్లే లక్ష్యంగా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా వైన్స్ నుంచి పెద్ద ఎత్తున బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా అవుతున్నా, ఒక్కో గ్రామంలో సుమారు పదుల సంఖ్యలో బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నా ఎక్సెజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్ట్ దుకాణాల సంఖ్య పెరుగుతున్నా ఆదాయమే లక్ష్యంగా వాటి జోలికి వెళ్లడం లేదన్నది బహిరంగ రహస్యం. చూసీచూడకుండా వదిలేయడంతో పాటు వారిని పరోక్షంగా ప్రోత్సహిస్తే ఆదాయం పెరగడంతో పాటు మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ అధికారులకు ఖర్చులు వస్తున్నాయని, తద్వారా రెండువిధాల ప్రయోజనాలు చేకూరుతున్నాయని విమర్శలున్నాయి.
