హైదరాబాద్, బతుకమ్మ: సీఎంగా కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపితే, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఆయకట్టు కింద పొలాలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండిన వరిని చూపుతూ సహచర ఎమ్మెల్సీలతో కలిసి కవిత బుధవారం శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి నీళ్లు ఉన్నాయని, ఎండల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వాటర్ మేనేజ్మెంట్ తెలియని ప్రభుత్వమిది అని ఎద్దేవా చేశారు. మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయడు 10వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లు పెరిగాయన్నారు. కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించగా ఆయనపై కోపంతో నీళ్లు వాడుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం నీటిని రైతులకు అదించాలని కోరారు. అప్పటి వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.
