నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డిల సమక్షంలో సోమవారం పూర్తి చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఎన్నికలు నిర్వహించవలసి ఉన్న నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులను మూడవ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.