Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 6:37 pm Posted by : ramakrishna

ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగల పట్టివేత

  • నలభై ఎనిమిది గంటలలో పట్టివేత
  • పట్టుబడిన చోరులు పాత నేరస్తులే

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని నాందేవ్ వాడలో సాయి బాలాజీ ట్రాన్స్ పోర్టులో చోరీకి పాల్పడిన దొంగలను నలబై ఎనిమిది గంటలలో పట్టుకున్నట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి మాట్లాడుతు.. ఈ నెల 6న తెల్లవారుజాము ప్రాంతంలో  నాందేవ్ వాడలోని సాయి బాలాజీ ట్రాన్స్ పోర్ట్ లో దొంగలు తలుపు తాళం ధ్వంసం చేసి బీరువాను బద్దలుకొట్టి అందులోని రు.10 లక్షలను ఎత్తుకెళ్లారు. ట్రాన్స్ పోర్టు యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర సిఐ రాజశేఖర్ రాజు, స్థానిక ఎస్ఐ హరిబాబు, సిసిఎస్ సిఐ సురేష్ , రవింధర్ ల ఆధ్వర్యంలో దొంగల కోసం వేట సాగించారు. శనివారం ఉదయంనగరంలోని దుబ్బ బైపాస్ రోడ్డులోని వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో నాగారం దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన షేక్ సాదక్ అలియాస్ సాధిక్ (14 చోరీ కేసులలో నిందితుడు), సురేకర్ ప్రకాష్ ( 4 చోరీ కేసుల నిందితుడు), సాయినాథ్ విఠల్ రావు (3 చోరీల కేసుల నిందితుడు)  నాగారంలోని 50 క్వార్టర్స్ కు చెందిన సయ్యద్ సాదుల్లా( 15 దొంగతనాల కేసులో నిందితుడు) అనుమానస్పదంగా  వెలుతుండగా పట్టుకుని విచారించడంతో ట్రాన్స్ పోర్టు ఆపీస్ దొంగతనం కేసు కొలిక్కి వచ్చింది. వారినుంచి రూ.10 లక్షల 17,500 నగదు, ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిపి తెలిపారు.

Thieves arrested for stealing from transport office