Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:35 pm Posted by : ramakrishna

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి నాపై తప్పుడు కేసు నమోదు చేశారు

 

. . . 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి నాపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని కార్పొరేటర్ మఠం పవన్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో బిజేపి నాయకులతో కలిసి మఠం పవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో సేవ చేస్తూ, ఎన్నికలో ప్రజల మద్దతుతో గెలిచానన్నారు. నా గెలుపును ఓర్వలేక కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతే కాకుండా ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో తనపై మంగళవారం కేసు నమోదు చేశారన్నారు. 8 వ డివిజన్ ప్రాంతంలో బిల్డర్ రోడ్డును ఆక్రమించుకొని ర్యాంపు నిర్మాణాన్ని చేపట్టడంతో ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో నన్ను అవమానించాలనే ఉద్దేశంతో నాపై తప్పుడు కేసు పెట్టించడం జరిగిందని పవన్ ఆరోపించారు. ఈ తప్పుడు ఫిర్యాదుకు ఐదవ టౌన్ ఎస్ఐ వత్తాసు పలుకుతూ నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేసు నమోదు చేశారని కార్పొరేటర్ విమర్శించారు. దీనిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ అక్రమ కేసు నమోదు వెనుక అధికార పార్టీ నాయకులతోపాటు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, మరొక వ్యక్తి పాత్ర ఉందన్నారు. అక్రమంగా భవనం కడితే నోటీస్ ఇవ్వడం జరిగిందని, తాను డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలతో చూపిస్తే దేనికైనా సిద్ధమని, ప్రజల పక్షాన ఉండి సేవ చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. డివిజన్ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పనులు పూర్తి అయ్యేలా పని చేస్తున్నానని, అబద్ధపు మాటలు చెబుతూ నాపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. సాక్షాలు ఉంటే చూపించాలని, లేని పక్షంలో వారిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.