- నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి
- లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- “ఆ చల్లని సముద్ర గర్భం” దృశ్యగీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం చేస్తూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా “ఆ చల్లని సముద్ర గర్భం” దృశ్యగీతాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించారు. దృశ్యగీతం ఆవిష్కరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండి పడ్డారు. చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారని, పర్యావరణ హణనానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను నరికేసే పరిపాలన సాగుతున్నదని అన్నారు. తెలంగాణ నేల మీద ఇప్పుడు మరో ఉద్యమం జరుగుతుందని పేర్కొన్నారు. నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదని గుర్తు చేశారు. ప్రతి ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. పోరాటానికి మందుగుండు సామాగ్రిని దాశరథి తయారు చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని.. తెలంగాణ కోణంలో పరిపాలన జరగడం లేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
