హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో శాసన మండలికి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. శాసన సభ్యులే ఎన్నుకునే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ లో చాలా మంది ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీలు గా పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున భరిలో నిలిచే అభ్యర్థులను ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖార్గే ఈ మేరకు ప్రకటించారు. శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్సీల ఎంపిక లాంఛనమే. తెలంగాణ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించారు. ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తరువాత ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న శాసన మండలి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేసి ముగ్గురి పేర్లను ప్రకటించింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఒక్కరే ఎమ్మెల్సీగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ రెండు పేర్లను ప్రపోజల్ చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విప్ జారీ, విప్ ఉల్లంఘించిన వారికి అనర్హత వేటు, బీజేపీ, ఎంఐఎం సహకరిస్తాయన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరిని బరిలో దించినట్లు చర్చ జరుగుతోంది.
