హైదరాబాద్, బతుకమ్మ : కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటి సారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీనరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై కవిత ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛ ను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈమాటలు చెబుతున్నానని శాసనమండలిలో కవిత భావోద్వేగానికి గురై కంటతడిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా పని చేశానని, పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారని, పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలపై పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ పై కక్షతో బీజేపీ తనను జైలుపెట్టించిందన్నారు. పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించానని పేర్కొన్నారు. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనే అవినీతి జరిగిందన్నారు. ఒక్క వర్షానికే సిద్దిపేట, సిరిసిల్లాలో కలెక్టరేట్ కొట్టుకుపోయింద్నారు. నీళ్లు నిధులు నియామకాలను పట్టించుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నో సార్లు అడిగానని, ఆఫ్యాక్టరీ తెరిపించకపోవడం తనకు అవమానకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు మాట్లాడలేదని, తను ప్రెస్ మీట్ పెట్టి అవినీతి పరుల పేరు చెప్పానని వెల్లడించారు.