- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా డంపింగ్ యార్డులు
- నిద్రావస్థలో అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : పరిశుభ్రత కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి లక్షలు వెచ్చించి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ తో పాటు డంపింగ్ యార్డులను నిర్మించింది. అక్కడే తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారీ కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో డంపింగ్ యార్డులను నిర్మించినా, ఈ ప్రభుత్వంలో నిర్వహణ లేక డంపింగ్ యార్డులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాణంపల్లి, సులేమాన్ నగర్, చిక్కడ్ పల్లి, రాయకూర్ తదితర గ్రామాలల్లో డంపింగ్ యార్డులు నిరూపయోగంగా అస్తవ్యస్థంగా ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. దీంతో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మండలంలో లక్షలు వెచ్చించి పంచాయితీల్లో డంపింగ్ యార్డుల వినియోగంపై అధికారులు మాత్రం శ్రద్ధ తీసుకోకుండా నిద్రావస్థలో మునిగి తేలుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో 80 శాతానికి పైగా గ్రామాల్లో తడి, పొడి వ్యర్ధాలను విభజించే ప్రక్రియ కనిపించడం లేదు. రుద్రూర్ – కోటగిరి ప్రధాన రహదారి పక్కనే స్వయంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త పడేయటం విస్మయానికి గురిచేస్తోంది. చెత్త వ్యర్ధాల నుంచి వెలువడే వాసనతో ప్రజలు, వాహనదారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్థుల పై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
