. . . పసుపు బోర్డు తొలి వార్షికోత్సవ సభలో ఎం.పీ, కలెక్టర్ వెల్లడి
. . . సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని పసుపు రైతులకు పిలుపు
. . . ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని హామీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపు పంటకు విస్తృత స్థాయిలో డిమాండ్ ఉన్నందున సేంద్రీయ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.పీ అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐ.ఏ.ఎస్ అధికారిని ఎన్.భవానిశ్రీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోర్డు చైర్మన్, కార్యదర్శులు వివరించారు. ఎం.పీ అరవింద్ మాట్లాడుతూ, పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, మూడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత రైతులు అలుపెరుగకుండా కొనసాగించిన పోరాటాలు, నిరవధిక కృషి ఫలితంగా జాతీయ పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిందని అన్నారు. బోర్డు ఏర్పాటైన ఫలితంగా ఇక్కడి పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోందని, విదేశాలకు నిజామాబాద్ ప్రాంత పసుపు పంటను పరిచయం చేయడంలో బోర్డు సఫలీకృతం అయ్యిందని అన్నారు. మునుముందు బోర్డు ద్వారా పసుపు రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చూస్తే పసుపు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగు చేస్తే మరింత డిమాండ్ ఉంటుందని ఎం.పీ సూచించారు. ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినా, ఆర్గానిక్ పసుపు పంటను మంచి డిమాండ్ తో కూడిన ధర పొందవచ్చని, ఈ మేరకు ట్రేడర్లను రప్పించే బాధ్యతను బోర్డు స్వీకరిస్తుందని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, పసుపు రైతుల సాధకబాధకాల గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. రైతులు పురాతన సంప్రదాయ పద్ధతులకు బదులుగా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక, సాంకేతిక విధానాలలో నాణ్యమైన పసుపు పంటను సాగు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఆధునిక యంత్ర పరికరాలను, నాణ్యమైన వంగడాలను వినియోగించడంతో పాటు, సేంద్రీయ విధానంలో పంటను సాగు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంటుందని హితవు పలికారు. పసుపు ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా పసుపు బోర్డు విశేషంగా కృషి చేస్తోందని, రైతులు కూడా మరింత నాణ్యమైన పసుపు పంటను పండిస్తే మంచి మద్దతు ధర పొందవచ్చని సూచించారు. కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా, పసుపు ప్రాసెసింగ్ విధానాలలోనూ శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ దిశగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, పసుపు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానవ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్ రావు, పసుపు బోర్డు అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.








