బోధన్, బతుకమ్మ :
యూరియా యాప్ను పూర్తిగా తొలగించాలని లేదా సంఘ పరిధిలోని గ్రామాలకు మాత్రమే పరిమితం చేసే విధంగా సవరణ చేయాలని ఏ. రవీందర్ అన్నారు. బోధన్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశం ఏ.రవీందర్ (అఫీషియల్ పర్సనల్ ఇన్చార్జ్) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి జమా-ఖర్చుల పట్టికతో పాటు సంఘ లావాదేవీల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని, రబీ పంటల కొనుగోలులో వేలిముద్ర విధానానికి బదులుగా ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని, చిన్న, సన్నకారు రైతులకు వడ్లను ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని తీర్మానించారు. ఈ మహాజన సభకు బోధన్ పట్టణ వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వరి, సంఘ మాజీ అధ్యక్షులు ఉద్మీర్ లక్ష్మణ్, వైస్ చైర్మన్ వీరభద్ర రావు, మాజీ సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, గ్రామ పెద్దలు పండిత్ రావు, నీలకంఠ రావు, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, సంఘ కార్యదర్శి ఉమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.
