- ఉమ్మడి జిల్లా ఆర్టీఏలో ఏజంట్ల ద్వారానే లంచాల స్వీకరణ
- చెక్ పోస్టులు మొదలుకుని కార్యాలయాలలో అధికారుల అవినీతిలో కీలకం
- ఇటీవల చెక్ పోస్టులలో తనిఖీలలో బహిర్గతం
- పాత పైళ్ల తాలుకు డబ్బులు ఏజంట్ నుంచి తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంవిఐ
నిజామాబాద్, బతుకమ్మ : తమ చేతికి మట్టి అంటకుండా అంతాఎజేంట్ల ద్వారనే వసూళ్ల కార్యక్రమాన్ని చెపడుతున్న రవాణా శాఖాధికారులు డబ్బుల విషయం ఎమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాహనాదారులైన, ఎజేంట్లైన తమకు ఒక్కటే అని డబ్బులు ఇస్తే ఫైల్ అయినా, వాహనాలైనా ముందుకు కదిలిస్తున్నారు. డబ్బుల కోసం ఎంత అవకాశం ఉంటే అంతా మేర అందిన కాడికి దండుకుంటున్నారు. పాత పైళ్ల తాలుకు డబ్బులు ఇస్తేనే కొత్త పైళ్ల పై సంతకాలు అంటే షరతులు పెట్టడంతో రూ.25 వేలను ఏజంట్ నుంచి తీసుకుంటుండగా ఎంవీఐని ఎసీబి అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకోవడంతో రవాణా శాఖలో కాసుల వేట వ్యవహరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గడిచిన నెలలో కామారెడ్డి జిల్లాలో రెండు జాతీయ రహదారులపై ఉన్న ఒక అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు, మరో జాతీయ రహదారిపై చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులతో హడలెత్తించారు. అక్కడ ఏజంట్లను నియమించుకుని బహిరంగంగా జరుగుతున్న వసూళ్ళ వ్యవహరాన్ని బట్టబయలు చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు ఏజంట్లపై కేసులు నమోదు చేసి చర్యలకు రవాణా శాఖకు సిఫారసు చేసిన విషయం తెల్సిందే.

ప్రభుత్వానికి ఆదాయం( రెవిన్యూ) అందించే శాఖలలో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ ల శాఖ ,రవాణా శాఖ( ఆర్టిఏ) శాఖాలు కీలకం. అయా శాఖలలో అవినీతి విచ్చల విడిగా సాగుతుంది. అయితే కీలకమైన శాఖలలో ఒకటైన రవాణా శాఖలో అవినీతి మయంగా మారింది. ప్రధానంగా తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ గడిచిన 7 నెలల కాలంలో దాదపు 150 మంది లంచావతారులను కట కటాల వేనక్కి పంపారు. కాని రవాణా శాఖలో అధికారులు మాత్రం జంకుబొంకు లేకుండా అవినీతి ( లంచాల ) వసూళ్లలో ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు ఏసీబీ చెక్ పోస్టులలో అకస్మీక తనిఖీలు చేస్తున్నా, కార్యాలయాలపై దాడులు చేస్తున్నాతమ చేతికి మట్టి అంటకుండా అధికారులకు సమాంతరంగా ఏజంట్ల ద్వారానే కార్యాకలాపాలను సాగిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో డిప్యూటి కమిషనర్ కార్యాలయం మొదలుకుని ఆర్టీవోల వరకు ఎంవీఐలతో ప్రారంభించి చెక్ పోస్టులలో పని చేస్తున్న ఏఎంవీఐలు చివరకు కానిస్టేబుళ్ళు కూడా వాహనదారుల నుంచి డబ్బులను ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు.
నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై గతంలో ఏసీబీ ఆకస్మిక దాడులను చేసింది. ఆనాడు కూడా రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుంటూ అధికారులు పట్టుబడలేదు. ఏజంట్ల వద్ద, సిబ్బంది వద్ద మాత్రమే లెక్కకు మించి డబ్బులు ఉండగా కేసులు నమోదు చేసి చర్యలకు సిఫారసు చేసింది ఏసీబీ. ఇటీవల కాలంలో కామారెడ్డి సరిహద్దులోని సలబత్ పూర్, కామారెడ్డి పట్టణ శివారులోని పొందుర్తి చెక్ పోస్టుపై జూన్ చివరి నుంచి జులై చివరి వరకు ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్కడ లెక్కకు మించిన డబ్బుల వసూళ్ళను గుర్తించారు. సలబత్ పూర్ లో ఏకంగా కౌంటర్ ఏర్పాటు చేసి అందులో డబ్బాలో డబ్బులు వేసి పోయేలా ఏర్పాట్లు చేశారు. ఏసీబీ దాడులు చేసినా 24 గంటల్లోనే సలబత్ పూర్ లో మళ్ళీ వసూళ్ళ కార్యక్రమం యధావిధిగా ప్రారంభమైంది. జాతీయ రహదారి 44పై ఉన్న పొందుర్తి చెక్ పోస్టులో 15 రోజులు స్తబ్ధంగా ఉన్న రవాణా శాఖాధికారులు మళ్ళీ ఏజంట్ల ద్వారా యధావిధిగా వసూళ్ళ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఉన్న లేనట్లే. బోధన్ లోని సాలురా చెక్ పోస్టులోనూ వసూళ్ళ కార్యక్రమం కొనసాగుతుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారుల కంటే ఏజంట్లతోనే కళకళలాడుతున్నాయి ఆఫీసులు. అధికారులు ఏజంట్ల ద్వారా డబ్బుల వసూళ్ళను కొనసాగిస్తున్నారు. ఏసీబీ దాడులు అంటే జంకుబొంకు లేకుండా వసూళ్ళ కార్యక్రమం మాత్రం నిరంతర ప్రక్రియగా సాగుతుంది. ఇటీవల చెక్ పోస్టులు ఎత్తివేస్తామని ప్రభుత్వం చెబుతున్నా పట్టించుకోకుండా బహిరంగంగా రాత్రిపగలు వసూళ్ళ కార్యక్రమం కొనసాగుతుంది.
